Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!

  • తెలంగాణలో వానల్లేవ్, వరదల్లేవ్
  • సీజన్ మొదలై నెల దాటినా పెద్ద వాన లేదు
  • ఆరుమళ్లు మొలకెత్తలేదు, విత్తులు మాడిపోతున్నాయి
  • ఈ నెలలోనూ వర్షాలు అంతంతమాత్రమే
  • ఎల్‌నినో ప్రభావంతో అప్పుడే కరువు ఛాయలు
Telangana Drought Alert

Telangana Drought Alert

Telangana Drought Alert 2026: తెలంగాణలో ఈ ఏడాది ‘వర్షాకాలం’ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెమ్మదిగా కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఈ సమయానికి సాగు పనులు ఊపందుకోవాల్సి ఉండగా.. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూమి మొత్తం పచ్చగా కనిపించాల్సి ఉండగా.. విత్తనాలు మాడిపోగా, ఆరుమళ్లు ఇంకా మొలకెత్తలేదు.

రైతులపై అదనపు ఆర్థిక భారం:

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిరుజల్లులు తప్ప ఇప్పటివరకు చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు. దీంతో విత్తనాలు వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావం కారణంగా ఇప్పటికే వేసిన విత్తనాలు మొలకెత్తక పోగా.. కొన్ని ప్రాంతాల్లో అవి ఎండిపోతున్నాయి. మరోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కరువు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

క్రమంగా పడిపోతున్న భూగర్భ జలాలు:

వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు కూడా క్రమంగా పడిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతుండగా.. సాగునీటి సమస్య మరింత తీవ్రమవుతోంది. తాగునీటి సమస్య కూడా రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచనలు పెద్దగా కనిపించడం లేదని వాతావరణ అధికారులు చెబుతున్నాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించడం ద్వారా నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

ఆకాశం వైపు ఆశగా:

ప్రస్తుతం వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా భారీ వర్షాలు కురవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నారు. వర్షాలు కురిసేందుకు కొన్ని చోట్ల గ్రామ దేవతలకు జనాలు పూజలు కూడా చేస్తున్నారు. 2005 ముందు పరిస్థితులు మరలా ఎదురయ్యాయని ప్రజలు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.