Here Is Process for Challenge Vote: ఎన్నికలు జరిగే సమయంలో ఓటర్ల పేర్లు జాబితాలో మిస్ అవ్వడం, కొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం సర్వసాధారణం. చాలా మంది తమ ఓటును వేరొకరు వేస్తే.. చాలా నిరాశపడుతుంటారు. అదే సమయంలో వారికి ఏం చేయాలో కూడా అర్ధం కాదు. అలాంటి వారు అస్సలు నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీ ఓటు మరొకరు వేసినా.. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకు పరిష్కారమే సెక్షన్ 49(పి). భారత ఎన్నికల సంఘం (ఈసీ) 1961లో సెక్షన్ 49(పి)ను అమల్లోకి తెచ్చింది.
పోలింగ్ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే.. సెక్షన్ 49(పి) ద్వారా ఓటు పొందొచ్చు. ఇందుకోసం ముందుగా ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వ్యక్తి తానే అని ప్రిసైడింగ్ ముందు నిరూపించుకోవాలి. ఇందుకు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను సమర్పించాలి. ఎన్నారైలు అయితే పాస్పోర్టు కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఆపై ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17(బి)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి.
Also Read: Gold Price Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే?
అనంతరం టెండర్ బ్యాలెట్ పేపర్ను ప్రిసైడింగ్ అధికారి… ఓటు కోల్పోయిన వ్యక్తికి ఇస్తారు. బ్యాలెట్ పేపర్పై నచ్చిన అభ్యర్థికి ఓటేసి మరలా ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. ఆయన ఆ బ్యాలెట్ పేపర్ను ప్రత్యేక కవర్లో భద్రపరిచి.. కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. అంతే మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నట్లే. అయితే సెక్షన్ 49(పి) ద్వారా వేసే ఓటును ఈవీఎం ద్వారా వేసేందుకు అధికారులు అనుమతివ్వరు. 49(పి) సెక్షన్ ద్వారా పొందే ఓటు హక్కును టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు అని అంటారు.