DGP CV Anand: తెలంగాణలో పోలీసింగ్ విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇస్తూ డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై “ఫ్రెండ్లీ పోలీసింగ్” అనే పేరుతో నేరస్తుల పట్ల సానుభూతి ఉండదని, ప్రజలను గౌరవిస్తాం.. కానీ రౌడీలు, గుండాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తాజాగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతమైందన్నారు. ఈ నేపథ్యంలో గ్రేహౌండ్స్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న సిబ్బందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తూ, వారి సేవలను ఇతర కీలక రంగాల్లో వినియోగించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రానికి గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా పెద్ద సవాల్గా మారిందని డీజీపీ పేర్కొన్నారు. వాటి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. డ్రగ్స్ ముఠాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, నేరస్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, సైబర్ క్రైమ్ ఇప్పుడు పోలీసు శాఖకు ప్రధాన సవాల్గా మారిందని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సైబర్ నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని డీజీపీ ప్రశంసించారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ సైతం మారాల్సిన అవసరం ఉందని, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక, “ప్రజలకు భరోసా ఇచ్చే పోలీసింగ్ కొనసాగుతుంది. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే రౌడీలు, గూండాలకు మాత్రం కఠినమైన పోలీసింగ్ తప్పదనే విషయం గుర్తుంచుకోవాలి” అని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.

