Minister Seethakka : తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’పై కేంద్ర ప్రభుత్వం తన పట్టును కొనసాగిస్తూ, 20వేల మంది భద్రతా సిబ్బందితో కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులను పట్టుకునేందుకు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా, సీఆర్పీఎఫ్ (CRPF) దళాలు బుధవారం కర్రిగుట్టపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. అయితే, అక్కడ పర్మినెంట్ బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం భద్రతా దళాలు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం, కర్రిగుట్ట పరిధిలోని దోబికొండ, నీలం సరాయి గుట్టలు పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలోకి వచ్చాయని అధికారులు తెలిపారు.
YS.Jagan: ప్రధాని సభకు రావాలంటూ జగన్కు ఆహ్వానపత్రిక.. పీఏకు ఇచ్చి వెళ్లిన అధికారులు
ఇలాంటి సమయంలో, కూంబింగ్ ఆపరేషన్లు కారణంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మంత్రి సీతక్క ఈ అంశంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ విషయంలో రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. కర్రిగుట్టలో కేంద్ర బలగాల ఆంక్షలతో అక్కడి ఆదివాసీల జీవితం ప్రశ్నార్థకమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు తమ జీవనాధారాన్ని కోల్పోతుండగా, వారి కుటుంబాలు అస్తవ్యస్త పరిస్థితుల్లో చిక్కుకున్నాయని ఫైర్ అయ్యారు. అలాగే, రాత్రింబవళ్లు కాల్పులు గిరిజనులను భయభ్రాంతులకు లోనుచేస్తున్నాయని, ఈ ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని మంత్రి సీతక్క కోరారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీల జీవనాధారానికి అడ్డంకి లేకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.