Site icon NTV Telugu

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే!

Telangana Cabinet

Telangana Cabinet

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ కేబినెట్‌ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఆర్డినెన్స్‌ ద్వారా పంచాయతీరాజ్‌ సహా పురపాలక చట్టాల సవరణ చేయనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పునరుద్ధరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంది.

1. ప్రపంచంలోనే పొడవైన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మిగిలిన సొరంగం పనులను అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీళ్లను అందించటంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు సొరంగం తవ్వకానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు కేబినెట్ అనుమతించింది. అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీ ముందుకు వచ్చింది. అదే కాంట్రాక్టు కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటి వరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఫిబ్రవరి 22న జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయి. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ ఆమోదించింది. 2028 జూన్ నాటికి ఎస్ ఎల్ బీ సీ ని పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించుకుంది.

2. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హై కోర్ట్ మధ్యంతర తీర్పు, సుప్రీం కోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలపై హై కోర్ట్ లో ఉన్న ఒక పిటిషన్ నవంబర్ 3న విచారణకు రానుంది. ఆ రోజున హైకోర్టులో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే నవంబర్ 7న మరోసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం జరిగింది. ఆ రోజున రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినేట్ తీర్మానించింది.

3. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ప్రొరోగ్ అయినందున చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తో ఆర్డినెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ ప్రతిపాదన ఫైలును గవర్నర్ గారికి పంపించాలని మంత్రివర్గం ఆమోదించింది.

4. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేయాలని కేబినేట్ చర్చించింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీ నగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.

Also Read: Jigris Movie: ప్రభాస్‌కు విషెష్ చెబుతూ.. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్ చేసిన ‘జిగ్రీస్’ టీమ్!

5. రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాట‌రీ ఎన‌ర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌ల‌కు రాష్ట్ర క్యాబినెట్ సూత్ర‌ప్రాయ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణ‌ల‌ను ఎక్క‌డ చేప‌ట్టాల‌నే దానిపై విద్యుత్ శాఖ త‌గిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది.

6. రామ‌గుండంలో 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్ (RTS-B 62.5 మెగావాట్ల‌ యూనిట్) కాల పరిమితి ముగిసినందున దానిని తొలగించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.

7. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్తు అవసరాలు, రాబోయే పదేండ్ల విద్యుత్తు డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్తు శాఖను కేబినేట్ ఆదేశించింది. అందుకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తికి అనుసరించాల్సిన వ్యూహాలను నివేదించాలని సూచించింది.

Exit mobile version