2022లో రిలీజైన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కాంతార.. ఏకంగా రూ.400 పైగా కోట్లు వసూళ్లు చేసింది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించగా.. సప్తమి గౌడ కథానాయిక. కాంతారకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్ల నుంచి షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై చిత్రబృందం స్పందించింది. ఊహాగానాలను నమ్మొద్దని, అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.
‘అనుకున్న ప్రకారమే షెడ్యూల్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాం. షూటింగ్ బాగా జరుగుతోంది. అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ విషయంలో మమ్మల్ని నమ్మండి. వేచి ఉండడం ఎంత విలువైందో మీకే అర్థమవుతుంది. కాంతార సినిమాపై వస్తోన్న ఊహాగానాలను నమ్మకండి. ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని చిత్రబృందం ఎక్స్లో పోస్ట్ చేసింది. కాంతార చాప్టర్ 1 వాయిదా అంటూ న్యూస్ రావడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు కూడా సినిమా వాయిదా అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
Also Read: IPL 2025: ఆర్సీబీ టార్గెట్ టాప్-2.. మరి ఎస్ఆర్హెచ్ ఏం చేస్తుందో!
ఇదివరకే వచ్చింది కాంతార రెండో పార్ట్. చిత్రీకరణ జరుపుకొంటున్నది తొలి పార్ట్ అన్న విషయం తెలిసిందే. కాంతార కథ ఎక్కడి నుంచి ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను కాంతార చాప్టర్ 1లో చూపించనున్నారు. పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు చాప్టర్ 1లో ఎక్కువగా ఉండనున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. చాప్టర్ 1పై భారీ అంచనాలే ఉన్నాయి. అన్ని భాషల్లోని ఫాన్స్ చాప్టర్ 1 కోసం ఎదురుచూస్తున్నారు. చాప్టర్ 1 అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.