NTV Telugu Site icon

Ashok Babu: ప్రజా జీవితం నుంచి ఆయన్ని విడదీయడం ఎవరి తరం కాదు..

Paruchuri Ashokbabu

Paruchuri Ashokbabu

TDP MLC Ashok Babu: అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్‌పై బయట ఉన్న జగన్మోహన్‌ రెడ్డి, ప్రజాసేవకుడైన చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌ బాబు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలో తానే కొత్త దారి చూపించాడని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో పెట్టుకొని జగన్ తప్పుచేశాడని వైసీపీ వాళ్లే అంటున్నారని ఆయన తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుపై జీవోలు ఇచ్చిన నీలం సహానీ, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు విచారించలేదో బుర్ర కథల బుగ్గన చెప్పాలని విమర్శించారు. డిజైన్ టెక్ సంస్థ ఎంపిక చేసుకున్న స్కిల్లర్ సంస్థ మరికొన్ని కంపెనీలతో వ్యాపార వ్యవహారాలు నడిపితే, అవి షెల్ కంపెనీలు అవుతాయా బుగ్గనా అంటూ ప్రశ్నించారు. అమరావతిలో వేయని ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ అని కొత్త కొత్త అభియోగాలు మోపుతున్నారన్నారు. ఒక దాని తర్వాత మరోటి తెర పైకి తెస్తూ ఈ ప్రభుత్వం, సీఎం జగన్ తమ పతనాన్ని తామే కోరి తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు విషయంలో తప్పు చేసిన వారికి టీడీపీ ప్రభుత్వం రాగానే రెట్టింపు దండన ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు గెలుపును ఆపడం.. ప్రజా జీవితం నుంచి ఆయన్ని విడదీయడం ఎవరి తరం కాదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు.

Also Read: Posani: పురంధేశ్వరిపై పోసాని సంచలన వ్యాఖ్యలు

వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో రూ.13 కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన బొత్స చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ అన్నారు. నాడు ప్రభుత్వంలో ఉండటంతో బొత్స ఆ కేసు నుంచి బయటపడగలిగారన్నారు. బొత్స , ఇతర మంత్రులు, ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సర్కార్, జగన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతిమ విజయం ధర్మానిదేనన్నారు. రాష్ట్ర పాలకులు రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో విర్ర వీగే జగన్ రెడ్డి అతని పరివారం భవిష్యత్ లో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.