Site icon NTV Telugu

YSRCP Vs TDP: రజనీకాంత్ ఏపీకి వచ్చి మాట్లాడారు.. ఆయనపై మీరు తమిళనాడుకు వెళ్లి కామెంట్‌ చేయగలరా..?

Varla Ramaiah Bonda Uma

Varla Ramaiah Bonda Uma

YSRCP Vs TDP: ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక వేదికగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. అయితే, వైసీపీ కామెంట్లకు టీడీపీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు.. తాజాగా, మంత్రులు, వైసీపీ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఏపీకి వచ్చి మాట్లాడారు.. ఇక్కడ రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేసిన కామెంట్లు తమిళనాడు వెళ్లి చేయగలరా..? అని సవాల్‌.. అవసరమైతే తమిళనాడు వెళ్లేందుకు నేను వైసీపీ నేతలకు కార్లు పెడతాను.. తమిళనాడులో రజనీపై కామెంట్లు చేసి తిరిగి రాగలరేమో చూద్దాం అంటూ కామెంట్ చేశారు.

Read Also: Virat Kohli: అది అసలైన భర్త అంటే.. భార్య బికినీ ఫోటో షేర్ చేసి

ఇక, పొత్తులు ఇంకా ఖరారు కాలేదన్నారు బోండా ఉమ.. పొత్తులు ఖరారు కాకముందే వైసీపీ నేతలకు ఎందుకంత ఉలుకు..? చంద్రబాబు-పవన్ కల్యాణ్‌ భేటీ జరిగితేనే వైసీపీ నేతలకు ఎందుకంత భయం..? అని ఎద్దేవా చేశారు. తలైవా రజనీకాంత్‌పై వైసీపీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయమే అన్నారు. రజనీకాంత్ కు టీ కప్పులు అందించిన చరిత్రను కొడాలి నాని మరిచినట్టున్నారు అంటూ సెటైర్లు వేశారు బోండా ఉమ. మరోవైపు.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. రజనీకాంత్‌.. సీఎం జగన్‌ను, వైసీపీని పల్లెత్తుమాట అనలేదు… కానీ, వైసీపీ ఫ్రస్టేషన్ తో రజనీపై దాడి చేయడం సరైందికాదన్నారు.. వైసీపీ నేతలు, మంత్రుల మాటలతో రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రేకెత్తే ప్రమాదముందన్న ఆయన.. రెండు రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ తక్షణమే అటు తమిళ ప్రజలకు, ఇటు తెలుగు వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తన పరిపాలన రథం తిరోగమనంలో పయనిస్తోందనే అక్కసుతోనే, సీఎం జగన్ తన పార్టీ వారితో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను అనరాని మాటలు అనిపించి ఆయన్ని కించపరిచారని విమర్శించారు వర్ల రామయ్య.. ప్రజలు తమపై, తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని అర్థమయ్యే, మంత్రులు నోళ్లకు పని చెబుతున్నారన్న ఆయన.. చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగా చేసిన అభివృద్ధి మంత్రి రోజాకు కనిపించకపోవడం దురదృష్టకరం అన్నారు.. బూతులు మాట్లాడే కొడాలి నానీ అంటే సజ్జల రాసిచ్చింది మాట్లాడతాడు..? సినీరంగం నుంచి వచ్చిన రోజాకు రజనీకాంత్ గొప్పతనం తెలియదా..? అని నిలదీశారు. రజనీకాంత్ ను ఉద్దేశించి రోజా చేసిన కామెంట్లను ఆయన అభిమానులు, తమిళ ప్రజలకు తెలిస్తే ఆమె పరిస్థితి ఏమిటో ఆమే చెప్పాలన్నారు.. దళితులకు జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందని దళిత సంక్షేమంలో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది? అని ప్రశ్నించారు వర్ల రామయ్య.

Exit mobile version