NTV Telugu Site icon

TDP: చంద్రబాబు నివాసానికి కృష్ణా జిల్లా నేతలు.. టార్గెట్‌ కేశినేని నాని!

Tdp

Tdp

TDP: కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్‌ యార్లగడ్డ వెంకట్రావు లోకేష్‌ను కలిశారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. కేశినేని నాని వెంట స్వామిదాస్ మినహా ఎవ్వరూ వెళ్లడం లేదని కృష్ణా జిల్లా నేతలు తెలిపినట్లు సమాచారం. వైసీపీ నుంచి ఇంకొందరు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. బొప్పన భవకుమార్ వైసీపీకి రాజీనామా చేశారని సమావేశంలో ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. కేశినేని నాని విషయంలో టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నామని బెజవాడ పార్లమెంట్ టీడీపీ నేతలు చెప్పినట్లు పలు వర్గాలు వెల్లడించాయి.

Read Also: Buddha Venkanna: కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్దం.

ఈ రాష్ట్రం బాగుపడాలంటే నాలా తెలుగుదేశంలో ఉండటమే సబబని నా పాత వైసీపీ మిత్రులంతా ఆలోచిస్తున్నారని తెలుగుదేశం గన్నవరం ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రజల నాడి తెలుసుకున్న వైసీపీ నేతలు తనతో చాలా బాధలు చెప్పుకుంటున్నారని ఆయన వెల్లడించారు. 94 ప్రభంజనం పునరావృతం అయ్యేలా ప్రస్తుత తెలుగుదేశం పరిస్థితి ఉందన్నారు. 89లో తెలుగుదేశం గెలిచింది రెండు ఎంపీ స్థానాలే అయినా, 94లో ఏం జరిగిందో చరిత్ర చెప్తోందన్నారు. వైసీపీ శ్రేణులకు నేను అన్నం పెడితే, ఆపార్టీ నాకు సున్నం పెట్టిందని ఆయన విమర్శించారు. రౌడీ షీటర్లు, చదువు సంస్కారం లేని వారికే వైసీపీలో ప్రాధాన్యం ఉందని ఆయన ఆరోపించారు. పనికి రాని మంత్రుల్ని పెట్టుకోవటం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడికొచ్చి గొడవ చేస్తేనో.. నోటికొచ్చినట్టు బూతులు తిడితేనో మంత్రి పదవులిచ్చారని ఆయన ఆరోపణలు చేశారు. మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి శాఖాపరంగా చేసిన ఒక్క సమీక్ష అయినా ఉందా అంటూ ప్రశ్నంచారు. వైసీపీ ఎమ్మెల్యేల రొటేషన్ విధానం ఏంటో ప్రజలెవ్వరికీ అర్ధం కావట్లేదన్నారు.