AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండో రోజు అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే.. టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారంలో తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో.. సభ మొదట 10 నిమిషాల పాటు వాయిదా పడింది.. ఆ తర్వాత మళ్లీ అదే రచ్చ సాగడంతో.. అసెంబ్లీకి బ్రేక్ ఇచ్చారు స్పీకర్.. బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగగా.. శాసన సభలో వీడియో తీస్తున్న టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకున్నారు స్పీకర్.. అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.. అయినా అసెంబ్లీలో గందరగోళం కొనసాగుతూనే వచ్చింది.. దీంతో.. మరో ముగ్గురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.. ఈ సారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, రామకృష్ణ బాబును సభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.. దీంతో.. మిగతా టీడీపీ సభ్యులు కూడా అసెంబ్లీని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు.
మరోవైపు.. మండలిలోనూ చంద్రబాబుపై కేసులు అక్రమం అనే అంశంపై చర్చకు పట్టుబట్టింది టీడీపీ.. శాసనమండలిలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగింది.. కంచర్ల శ్రీకాంత్, బీటీ నాయుడు, పంచుమర్తి అనురాధను శాసనమండలి చైర్మన్ సస్పెండ్ చేశారు.. బలవంతంగా ఎమ్మెల్సీలను బయటకు పంపించారు తెచ్చిన మార్షల్స్. మండలి లాబీల్లో టీడీపీ ఎమ్మెల్సీల నినాదాలు చేయడంతో.. ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో టీడీఎల్పీ కీలక నిర్ణయం తీసుకుంది.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు.. ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యేలు.
అసెంబ్లీలో జరుగుతోన్న పరిణామాలపై మీడియాతో మాట్లాడిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గట్టిగా మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. చంద్రబాబుపై కేసులు ఎత్తిసి ప్రజలకు క్షమాపణ చెబితే చర్చకు సిద్ధం అని వెల్లడించారు. 5 రోజులు ప్రత్యేక సమావేశాలు పెట్టే అవినీతిపై చర్చిద్దాం.. చంద్రబాబును అసెంబ్లీకి తీసుకొచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. స్పీకర్ మమ్మల్ని యూజ్ లెస్ ఫెలోస్ అని తిట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి.. 22 మంది టీడీపీ సభ్యుల కోసం 200 మంది మార్షల్స్ ను పెట్టి అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. శాసనసభలో ఏం జరుగుతుందో తెలియకుండా స్పీకర్ కట్టడి చేస్తున్నారు. అందుకే వీడియోలు తీస్తున్నాం అని వెల్లడించారు.