YSRCP: ఓవైపు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తూనే.. మరోవైపు.. ఇతర పార్టీల నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పనిలో పడిపోయారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రతీ రోజూ ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కొందరు నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నైట్ స్టే పాయింట్ వద్ద గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు, మంగళిగిరి నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు జగన్.
Read Also: Nagababu: అన్నీ సర్దుకున్నాయి.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం..
గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జనసేన రాష్ట్ర కన్వీనర్ వీరశెట్టి సుబ్బారావు.. ఇక, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, బీజేపీ స్టేట్ కో కన్వీనర్ డాక్టర్ టీవీ రావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు టీడీపీ జిల్లా కన్వీనర్ బైరా అజయ్బాబు, గుంటూరు జిల్లా టీడీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగగౌడ్, మైనార్టీ నేత షేక్ షాజిత్ కూడా వైసీపీ గూటికి చేరినవారిలో ఉన్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు.. సజ్జల రామకృష్ణా రెడ్డి.. తదితర నేతలు పాల్గొన్నారు.