TCS Nashik Case: నాసిక్ నగరంలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో జరిగిన “కార్పోరేట్ లవ్ జీహాద్” కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. లైంగిక వేధింపులు, మత మార్పిడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంత మంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్థలో కీలక స్థాయిల్లో పని చేస్తున్న హెచ్ఆర్, మేనేజర్ సహా ఏడుగురికి అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు వీళ్లను విచారిస్తున్నారు. పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించగా, భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారం ఫిబ్రవరి నెలలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైంది. టీసీఎస్లో పనిచేస్తున్న ఒక హిందూ యువతి రంజాన్ ఉపవాసాలు పాటిస్తోందని, ఆమె ప్రవర్తనలో మార్పులు వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
READ MORE: Alia Bhatt : లేటౌతున్న ఆలియా భట్ మూవీస్.. 2025 స్కిప్ చేసిన త్రిబుల్ ఆర్ బ్యూటీ
తొలుత నాసిక్ పోలీసులు గోప్యంగా ఓ ఆపరేషన్ను చేపట్టారు. ఇందులో భాగంగా నలుగురు పోలీసులు హౌస్ కీపింగ్ సిబ్బంది వేషధారణలో ఆఫీసులోకి వెళ్లారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను రెండు వారాల పాటు నిశితంగా గమనించారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న కొందరు టీమ్ లీడర్లు, సీనియర్ ఉద్యోగులు మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించడం గమనించారు. అంతేకాదు.. వారిని మత మార్పిడికి ప్రేరేపిస్తున్నట్లు తేటతెల్లమైంది. ఈ లవ్ జీహాదీ ముఠా ముఖ్యంగా 18-25 ఏళ్ల మధ్య తరగతి యువతులనే టార్గెట్ చేస్తున్నట్లు తేలింది. బాధితుల శాలరీలు సైతం రూ.18-25 వేల మధ్యే ఉన్నాయి. పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలేషియాకు చెందిన ఇర్మాన్ అనే మత ప్రచారకుడి పేరు బయకు వచ్చింది. ఇర్మాన్ వీడియో కాల్స్ ద్వారా బాధితులతో పరిచయం పెంచుకున్నాడు. వాట్సాప్ చాట్స్ ద్వారా ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు డానిష్ షేక్. తనకు ఇంతకు ముందే వివాహం జరిగింది. తనకు పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టి ఒక యువతిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఆపై ఆమెను ఇస్లాం వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు.
READ MORE: YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
ఆ యువతిని రంజాన్ ఉపవాసాలు ఉండేలా, నమాజ్ చేసేలా ఒత్తిడి తెచ్చారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. నిందితుడి భార్య స్వయంగా బాధితురాలికి ఫోన్ చేసి డానిష్కు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పడంతో ఈ బంధం బయటపడింది. దీనిపై నమోదైన మొదటి ఎఫ్ఐఆర్ తర్వాత.. ఒక్కొక్కరిగా మహిళా ఉద్యోగినులు ధైర్యంగా చేసి ముందుకు వచ్చారు. తమపై జరుగుతున్న వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు లైంగిక వేధింపులు, మత మార్పిడి ప్రయత్నాలు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సంబంధించి మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూఖ్ ఖురేషి, రజా మేమన్, తౌసిఫ్ అత్తార్, అశ్విన్ చైనానీ సహా మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ దారుణాలపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన విషయమని వ్యాఖ్యానించారు. సంస్థలో ఇలాంటి వేధింపులకు ఏమాత్రం తావులేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీసీఎస్ స్పష్టం చేసింది. ఇప్పటికే నిందితులను సస్పెండ్ చేయడంతో పాటు, సంస్థ అంతర్గత విచారణ కోసం సీఓఓ ఆర్తి సుబ్రమణియన్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయంగానూ ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ దీనిని “కార్పొరేట్ జిహాద్” అని అభివర్ణించగా, మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ బాధితులకు ఉద్యోగాల ఆశ చూపి, వారిని ట్రాప్ చేసి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించారని సంచలన ఆరోపణలు చేశారు.