బాలీవుడ్ తెరపై బలమైన మహిళా పాత్రలకు ప్రాణం పోయడంలో నటి తాప్సీ పన్ను సిద్ధహస్తురాలు. కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇచ్చే ఆమె, ఇప్పుడు ‘అస్సీ’ (Assi) అనే ఇంటెన్స్ కోర్టు రూమ్ థ్రిల్లర్తో మన ముందుకు వస్తున్నారు. గతంలో ‘పింక్’, ‘ముల్క్’, ‘థప్పడ్’ వంటి చిత్రాల ద్వారా సమాజంలోని సున్నితమైన సమస్యలను ప్రశ్నించిన తాప్సీ, మరోసారి దేశంలోని న్యాయవ్యవస్థ.. సామాజిక పరిస్థితులపై గొంతెత్తబోతున్నారు. ఈ చిత్రం కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, ఆలోచన రేకెత్తించే ఒక సామాజిక సందేశాన్ని కూడా ఇవ్వబోతుంది. అయితే సినిమా విడుదలకు ఒక వారం ముందుగానే వివిధ నగరాల్లో స్పెషల్ స్క్రీనింగ్స్ నిర్వహిస్తున్న సందర్భంగా తాప్సీ ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగపూరితమైన నోట్ షేర్ చేశారు.
Also Read : Chiranjeevi: ‘యుఫోరియా’లో గౌతమ్ మీనన్ రోల్ చిరంజీవి చేయాల్సిందా?
“హిందీ పరిశ్రమలో వాస్తవిక కథలు లేవని విమర్శిస్తూ మనం ముసుగులో దాక్కోవద్దు. అద్భుతమైన కథలను థియేటర్లకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రేక్షకుల ‘బద్ధకం’ వల్ల అవి ఫెయిల్ అవ్వకూడదు. ప్రపంచ సినిమాతో మనం పోటీ పడాలంటే, ముందుగా మన దేశీ కథలను మనం ఆదరించాలి” అని ఆమె పేర్కొన్నారు. మనం మౌనంగా ఉంటే భవిష్యత్తులో మంచి సినిమాలు రాకుండా పోతాయని, ప్రతిభ ఉన్న సినిమాలకు మన గొంతుక తోడవాలని ఆమె పిలుపునిచ్చారు.. ‘ఈ సినిమాలో మా కథనంపై మాకు నమ్మకం ఉంది, మీరు కూడా థియేటర్లకు వచ్చి మంచి సినిమాలకు మద్దతు ఇవ్వండి” అని తాప్సీ కోరారు. ‘అస్సీ’ సినిమా ద్వారా ఆమె అత్యాచార కేసులు.. న్యాయవ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.