టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ఉదయం భారత క్రికెటర్లు స్వదేశానికి వచ్చారు. అనంతరం.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ప్రధాని ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా మోడీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Gummadi Sandhya Rani: విద్యా, ఉపాధి కల్పిస్తాం.. గంజాయి పండిస్తే కఠిన చర్యలు
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం భారత క్రికెటర్స్ ఢిల్లీ ఎయిర్పోర్టుకు బయల్దేరారు. భారత క్రికెటర్లు నేరుగా ముంబైకి వెళ్లారు. కాసేపట్లో ఓపెన్ టాప్ బస్లో రోడ్షో నిర్వహించనున్నారు. అభిమానులందరూ ఈ వేడుకలో పాల్గొననున్నారు. కాగా.. ఇప్పటికే ముంబైలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. రోడ్షో అనంతరం వాంఖడేలో ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించనుంది. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: Rajasthan: కొంపముంచిన సవాల్.. మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా
దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్ నెగ్గింది. చివరిగా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2011 వన్డే ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండోసారి టీ20 ప్రపంచకప్ను దక్కించుకోవడానికి ఏకంగా 17 ఏళ్లు పట్టింది. మొదటి ఎడిషన్ 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే భారత్ పొట్టి కప్ గెలిచింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర పడడంతో భారత అభిమానుల్లో చెప్పలేని ఆనందం నెలకొంది.