Suryakumar Yadav Likely to miss 1st Two Games for Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక మార్చి 24న నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఢీకొట్టనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు ముంబైకి భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మొదటి రెండు మ్యాచులకు దూరం కానున్నాడని సమాచారం. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్య ముంబై ఆడే తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ఈ ఏడాది ఆరంభంలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న సూర్యకుమార్ యాదవ్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వైద్య బృదం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే సూర్య ఇంకా బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆరంబించలేదని తెలుస్తోంది. ఇటీవల మిస్టర్ 360 తన పోస్ట్ చేసిన వీడియోలలో ఎక్కడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు లేదు. దీంతో సూర్య ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని అర్ధమవుతోంది. ఎన్సీఏ అతడికి ఎన్ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా లేకున్నా.. గుజరాత్ టైటాన్స్ పటిష్టంగానే ఉంది!
ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ తొలి రెండు మ్యాచ్లకు దూరమైతే.. ముంబై ఇండియన్స్కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి ఇంకా 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడో లేదో చూడాలి. ఐపీఎల్లో 139 మ్యాచులు ఆడిన సూర్య.. 3249 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్య చాలా ఏళ్లుగా ముంబైకి ఆడుతున్న విషయం తెలిసిందే.