Supreme Court: పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది. జననాల సంఖ్య పెరిగినప్పటికీ భారతదేశ జనాభా స్థిరంగా ఉందని, కోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమస్య కాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీనిపై ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కోర్టు వెల్లడించింది. ఈ అంశంపై లా కమిషన్ నివేదిక చాలా ముఖ్యమైనదని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ అన్నారు ” ఇది సామాజిక సమస్య. దీనిపై లా కమిషన్ ఏమని నివేదిక ఇవ్వగలదు?” అని న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Special Story on Marriages: రోజులు 31. పెళ్లిళ్లు 32 లక్షలు. ఖర్చు 3.75 లక్షల కోట్లు
పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ఇద్దరు పిల్లల నిబంధనతో సహా కొన్ని చర్యలను కోరుతూ చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. దేశంలో జనాభా నియంత్రణకు సమర్థ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని అశ్వినికుమార్ ఉపాధ్యాయ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించడానికి ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు చెప్పడంతో ఆయన దానిని ఉపసంహరించుకున్నారు. ఆయన అభ్యర్థనతో పాటు, ఈ సమస్యపై దాఖలైన మరికొన్ని పిటిషన్లను కూడా ధర్మాసనం తిరస్కరించింది. వాటిని ఉపసంహరించుకోవాలని న్యాయవాదులను ప్రేరేపించింది. ఈ విషయంపై కోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. జనాభా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నామని కోర్టుకు నివేదించింది.