Fog: వేసవి కాలం మధ్యలోనూ గోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా రాజమండ్రిలో ఉదయం వేళ గోదావరి నదిపై విస్తరించిన దట్టమైన పొగమంచు కారణంగా పరిసర ప్రాంతాలు పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొంది. గోదావరి నదిపై ఉన్న రోడ్ కం రైల్వే బ్రిడ్జి, హేవలక్ బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి పొగమంచుతో పూర్తిగా కప్పుకుపోయాయి. దీంతో రోడ్ కం రైల్వే బ్రిడ్జి పై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా స్పష్టంగా కనిపించకపోవడంతో డ్రైవర్లు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది.
Read Also: AP Cabinet 2026: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. అభివృద్ధి ప్రాజెక్టులు, భూముల కేటాయింపులకు ఆమోదం!
ఇక, ఉదయం గోదావరి ఘాట్లకు వెళ్లే భక్తులు, అలాగే గోదావరి బండపై వాకింగ్ చేసే వారు ఈ అరుదైన దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా శీతాకాలంలో కనిపించే పొగమంచు, వేసవిలో కూడా ఇలా కమ్ముకోవడం అరుదైన విషయమని వారు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఉదయం 7 గంటలైనప్పటికీ పొగమంచు పూర్తిగా తొలగకపోవడం గమనార్హం. దీనివల్ల కొంతసేపు ట్రాఫిక్ కూడా నెమ్మదించింది. పర్యావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగానే ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు భావిస్తున్నారు. ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, తేమ శాతం పెరగడం వంటి కారణాల వల్లే వేసవిలో కూడా పొగమంచు ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.