సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి విజయం సాధించింది. ఇవాళ రాజస్థాన్తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (77), యశస్వి జైస్వాల్ (67) అర్ధశతకాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి (76*), హెడ్ (58), క్లాసెన్ (42*) చెలరేగి ఆడారు. అవేశ్ ఖాన్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.
అయితే.. ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబద్.. తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేశాడు. అయితే తనదైన శైలిలో వేగంగా ఆడడంలో హెడ్ విఫలమయ్యాడు. హెడ్ ఆటతీరును బాగా పరిశీలించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు… ఏమాత్రం అర్థం కాని రీతిలో బంతులు వేయడం, కీలక స్థానాల్లో ఫీల్డర్లను మోహరించడం ద్వారా అతడి దూకుడుకు అడ్డుకట్ట వేసింది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 12 పరుగులకే వెనుదిరగ్గా, మార్ క్రమ్ స్థానంలో వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ 5 పరుగులకే అవుటయ్యాడు. ఈ దశలో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ జోడీ స్కోరుబోర్డును ఉరకలెత్తించింది. నితీశ్ రెడ్డి 42 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న నితీశ్ 3 ఫోర్లు, 8 సిక్సులు బాదడం విశేషం. క్లాసెన్ కూడా వేగంగా ఆడడంతో సన్ రైజర్స్ స్కోరు 200 దాటింది. క్లాసెన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.