పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సంస్థలు ‘స్పిరిట్’ తెలుగు వెర్షన్ హక్కుల కోసం కళ్లు చెదిరే భారీ మొత్తాన్ని వెచ్చించాయి. ప్రభాస్ మార్కెట్ క్రేజ్ మరియు సందీప్ వంగా మేకింగ్పై ఉన్న నమ్మకంతో టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. మొదటిసారి చేతులుకలిపిన మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి. బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని 2027 మార్చి 5గా ప్రకటించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.