Crime News: తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని గురువులు బోధిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలకు చదువులు చెప్పించి పెంచుతారు. తనకు తినడానికి ఏమిలేకపోయినా తన పిల్లలకు ఉంటే చాలు అనుకునే తల్లిదండ్రులను నిత్యం చూస్తూ ఉంటాం. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి వారిని పెంచి పెద్దచేస్తుంటారు. కానీ కొందరు బిడ్డలు మానవత్వం మర్చిపోయి..తల్లిదండ్రులపై దారుణాలకు తెగబడుతున్నారు. ఆస్తుల కోసం కనిపెంచిన అమ్మానాన్నలపై దాడులకు తెగబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారిని చంపేందుకు కూడా వెనకాడటం లేదు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు..తమ పేగులనే కత్తులతో పొడిచేస్తుంటే.. నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.
Read ALso: Counselling to RowdySheeters: ఎన్నికల వేళ బెజవాడలో రౌడీ షీటర్లకి పోలీసుల వార్నింగ్
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువులా ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఆస్తికోసం నడిరోడ్డుపై తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చితకబాదాడు. ఎత్తుకుని పెంచిన తల్లి గుండెలపైనే కాలితో తన్నాడు. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకుంటూ దండం పెడుతున్నా ఆ కసాయి కొడుకు కనికరించలేదు. కసాయి కొడుకు దెబ్బలకు వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అంతేకాక మరింత రెచ్చిపోయి.. ఆ మాతృమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మలకు ఇద్దరు కుమారులు కాగా…రెండు ఎకరాల పొలం మరో కుమారుడికి రాస్తావా అంటూ తల్లిదండ్రులపై దాష్టీకం చూపించాడు కుమారుడు శ్రీనివాసులు రెడ్డి. బూతులు తిడుతూ సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లిని ఈడ్చుకుంటా కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిపై వీడు మనిషేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కొడుకులు పుట్టొందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.