Chegondi Harirama Jogaiah Son Suryaprakash Joins in YSRCP: జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరారు. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్సార్ సీపీలో చేరారు. జనసేన పార్టీలో క్రీయాశీలక సభ్యునిగా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరించిన సూర్యప్రకాష్, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి చేస్తున్న పొత్తు రాజకీయంతో విభేధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: Deputy CM Narayana Swamy: నా కుమార్తెను ఎన్నికల్లో గెలిపించండి..
జనసేన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదని చేగొండి సూర్య ప్రకాష్ అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నడపలేని అసమర్థుడు, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ కొమ్ము కాస్తున్నాడన్నారు. చంద్రబాబును, లోకేష్ను సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 100 నియోజకవర్గాల్లో కనీసం ఇంఛార్జిన కూడా నియమించలేదన్నారు. జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టారని.. జనసేన పార్టీ నమ్ముకున్న బడుగు బలహీన వర్గాలను ముంచేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని విమర్శించారు. ఆరు సంవత్సరాల కాలంలో తనతో కేవలం 30 నిమిషాలు మాత్రమే మాట్లాడారన్నారు. ఆరు ఏళ్లుగా జనసేన పార్టీ కోసం పని చేశానన్నారు.
కేవలం ముగ్గురు మాత్రమే స్టేజ్ పై కూర్చుని ఉంటారని.. ఎవరైనా ప్రశ్నిస్తే వైసీపీ కోవర్టులు అని పవన్ కళ్యాణ్ అంటున్నారన్నారు. మనసు చంపుకుని జనసేనలో ఉండలేక… బయటికి వచ్చానన్నారు. జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉందన్నారు. వైసీపీకి, జగన్ కు ఏమి ఆశించకుండా చేదోడువాదోడుగా ఉంటానన్నారు. బేషరతుగా వైసీపీ పార్టీలో చేరానన్నారు.