Sharmistha Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్టా ముఖర్జీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాలంటే కొద్ది రోజులు ప్రజల్లో ఉంటూ, మళ్లీ మాయమయ్యే వ్యవహారం కాదని, రాజకీయం 24 గంటలు, ఏడాది పొడవునా కొనసాగే పూర్తి బాధ్యత అని ఆమె అన్నారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేవారు. 2014లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతగా ఉన్నప్పటి నుంచి పార్టీ వరసగా ఎన్నికల్లో ఓటములు చవిచూస్తోందని, ఇది ఆయన నాయకత్వ వైఫల్యంగా భావించాల్సిందే అని పేర్కొన్నారు.
2024 లోక్సభ ఎన్నికల ముందు భారత్ జోడో యాత్ర కాంగ్రెస్కు కొంత మేర ప్రయోజనం చేకూర్చిందని అంగీకరిస్తూనే, కొన్ని కార్యక్రమాల్లో రాహుల్ గాందీ కనిపించి, ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా పోతారని విమర్శించారు. భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవ సమయంలో రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు..? అని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో రెండు రోజులు ప్రజల్లో తిరిగి, సభలు నిర్వహించి, ఆ తర్వాత కనిపించకుండా పోవడం సరైన విధానం కాదని శర్మిష్టా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పొత్తులపై ఆధారపడుతోందని, సొంతగా సంస్థాగత బలాన్ని పెంచుకోవడంపై ఆలోచించడం లేదని ఆమె ఆరోపించారు. తాను కాంగ్రెస్లో పనిచేసిన సమయంలో పార్టీ అంతర్గతంగా బలోపేతం అవ్వడం కన్నా, పొత్తుల ద్వారా గెలవాలనే ఆలోచన ఎక్కువగా కనిపించేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రజాదరణ కలిగిన నాయకుడని, ఆయనకు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని, అదే స్థాయిలో కాంగ్రెస్కు ప్రజామద్దతు తీసుకురావడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని అన్నారు. రాహుల్, ప్రియాంకా గాంధీల నాయకత్వాన్ని పోల్చేందుకు తాను ఇష్టపడటం లేదని శర్మిష్టా చెప్పారు.

