వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల “ప్రజా ప్రస్థానం” మహా పాదయాత్ర ఇవాళ చేవెళ్లలో మొదలు కానుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు చేవెళ్లలో, శంకర్ పల్లి క్రాస్ రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించి, 11.30 గంటలకు పాదయాత్ర మొదలు కానుంది. 2.5 కిలో మీటర్లు నడిచి, మధ్యాహ్నం 12.30 గంటలకు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది.
అక్కడ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం 1.30 గంటలకు భోజనం చేస్తారు. తిరిగి సాయంత్రం 3.00గంటలకు కందవాడ గేట్ క్రాస్ నుంచి పాదయాత్ర మొదలవుతుంది. 6.5 కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం 7.00గంటలకు కందవాడ గ్రామానికి చేరుకుంటుంది. తొలి రోజు మొత్తం 10 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుంది. వైఎస్ పాలనే లక్ష్యంగా షర్మిల పాదయాత్ర చేయనున్నారు.