దేశ రాజధానిలో దిగ్భ్రాంతకర ఘటన చోటు చేసుకుంది. ఐఏఎస్ కావాలని కలలు గన్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో భవనం బేస్మెంట్లో నీటిలో చిక్కుకుని జల సమాధి అయ్యారు. వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే తాజాగా ఈ అంశం ఉభయసభల్లో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై రాజ్యసభలో చర్చ జరగగానే.. ఛైర్మన్ జగదీప్ ధంఖర్ కూడా వ్యాఖ్యానించారు. నేడు కోచింగ్ వ్యాపారంగా మారిందని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. “కోచింగ్ అనేది నేడు ఒక రకమైన వ్యాపారంగా మారింది. మనం తరచుగా వార్తాపత్రికలను చూసినప్పుడు మొదటి లేదా రెండు పేజీలలో వాటి ప్రకటనలు భారీగా కనిపిస్తాయి.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Ganja In Metro: బరితెగించారు.. ఏకంగా మెట్రోలోనే గంజాయి తాగుతున్న వ్యక్తి..
పార్లమెంట్ లో ప్రస్తావన..
ఈరోజు లోక్సభలో న్యూఢిల్లీ ఎంపీ బన్సూరి స్వరాజ్ రాజేంద్ర నగర్ కోచింగ్ ప్రమాదాన్ని తీవ్రంగా లేవనెత్తారు. కోచింగ్ ప్రమాదంపై విచారణ కమిటీ వేయాలని ఆప్ ప్రభుత్వంపై బన్సూరి స్వరాజ్ మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని.. ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బన్సూరి స్వరాజ్ ఆరోపించారు. మరోవైపు కన్నౌజ్ ఎంపీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఢిల్లీలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అఖిలేష్ యాదవ్ అడిగారు. ఈ ఘటన బాధాకరమని, ఇలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లపై ప్రభుత్వం బుల్డోజర్లను నడుపుతుందా? అని నిలదీశారు.