Sajjala Ramakrishna Reddy: వాలంటీర్లపై తప్పుడు ప్రచారం.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైసీపీదే ఘన విజయం

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే ఘన విజయం అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, నాలుగు అయిదు నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసింది.. ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది..? అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు గందరగోళం అంతా టీడీపీ కూటమిలోనే ఉందన్న ఆయన.. వాళ్లను కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.. నలుగురు వ్యక్తులు వచ్చరని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు సజ్జల..

Read Also: Congress: రాయ్‌బరేలీ, అమేథీ సీట్లపై ఏకే.ఆంటోనీ కీలక వ్యాఖ్యలు

ఇక, చంద్రబాబు రోజుకు ఒక మాట మారుస్తారు అని దుయ్యబట్టారు సజ్జల.. చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తున్నారన్న ఆయన.. వాలంటీర్‌ వ్యవస్థపై నమ్మకం ఉంటే.. ఇన్నాళ్లు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతి ఏంటి? అని నిలదీశారు. వాలంటీర్‌ వ్యవస్థపై చంద్రబాబు తప్పుగా మాట్లాడారు.. తాము అధికారంలోకి వస్తే తీసివేస్తా అన్నారు.. ఇప్పుడు ఆ వ్యవస్థనే కొనసాగిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పిదారి అధికారంలోకి వస్తే ఇప్పడు ఉన్న వాలంటీర్లను తీసివేసి.. జన్మభూమి కమిటీ సభ్యులతో నింపుతారని ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో ప్రజల తీర్పు ఇప్పటికే స్పష్టంగా ఉంది.. తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు.. రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రచారంలో ఉంటే అడిగే హక్కు టీడీపీకి ఎక్కడి? అని నిలదీశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.