రాష్ట్రంలో వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుపై టీడీపీ-జనసేన పార్టీలు చేసిన విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ- జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఆయన చురకలంటించారు. ఎక్కడ పోటీ చేయాలో.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో.. వాళ్ళకు ఇప్పటికీ స్పష్టత లేదు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మార్పులు చేర్పులు అన్ని అంతర్గత వ్యవహారం.. 2014లో చంద్రబాబు చేసిన తప్పుడు పనులు జనం మర్చిపోయారు అనుకుంటున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Read Also: Thalaivar 170: వేటగాడు గా వస్తున్న రజినీ.. ఈ ఏజ్ లో కూడా ఆ స్టైల్ ఏంటి తలైవా
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నారా లోకేష్ ఇమిటేట్ చేస్తుంటాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లోకేష్ 3 వేల కిలో మీటర్ల పాదయాత్ర ఎక్కడ చేశాడో ఎవరికీ తెలియదు.. నాయకుడిని మార్చితే కింద ఉన్న క్యాడర్ ఇబ్బంది పడటం సహజం.. అందరినీ పిలిచి మాట్లాడతామని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న చికాకులను సరిదిద్దటం పెద్ద విషయం కాదు.. కుప్పం సహా 175 స్థానాల్లో వైసీపీ పార్టీ గెలుపు ఖాయం.. కుప్పంలో చంద్రబాబు గెలిచే అవకాశం లేదు అని సజ్జల వెల్లడించారు. బీసీల స్థానాల్లో చంద్రబాబు, లోకేష్ ఎందుకు పోటీ చేస్తున్నారు? ప్రశ్నించారు. మా పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో మాకు తెలుసు.. ఎలా గెలవాలో? గెలవాలంటే ఏం చేయాలో ఆ స్ట్రాటజీ మాకు ఉంది అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.