Team India Spin Bowling Coach:భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత సీనియర్ పురుషుల జట్టుకు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్గా మాజీ భారత క్రికెటర్ సైరాజ్ బహుతులేను నియమించింది. దేశీయ క్రికెట్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), ఇండియా ‘ఎ’ జట్టు, అండర్-19 జట్టుతో పాటు ఐపీఎల్లో కూడా విశేష అనుభవం కలిగిన బహుతులేకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
188 మ్యాచ్లు.. 630 వికెట్లు
53 ఏళ్ల సైరాజ్ బహుతులే భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన దేశీయ ఆల్రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. భారత జట్టు తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడినప్పటికీ, దేశీయ క్రికెట్లో ఆయన సాధించిన విజయాలు అసాధారణమైనవి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 188 మ్యాచ్లు ఆడి 6,176 పరుగులు చేయడంతో పాటు 630 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సృష్టించారు. అలాగే లిస్ట్-ఏ క్రికెట్లో 143 మ్యాచ్ల్లో 197 వికెట్లు సాధించారు.
బహుతులే అరంగేట్రం చేసింది ఎప్పుడంటే..?
సైరాజ్ బహుతులే అంతర్జాతీయ అరంగేట్రం 2001లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ సిరీస్లో జరిగింది. ఆ సిరీస్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ అవకాశాలు రాకపోయినా, దేశీయ క్రికెట్లో ఆయన తనదైన ముద్ర వేశారు. ఆటగాడిగా రిటైర్మెంట్ అనంతరం కోచ్గా కూడా బహుతులే విశేష విజయాలు సాధించారు. కేరళ, బెంగాల్, విదర్భ, గుజరాత్ వంటి రాష్ట్ర జట్లకు ప్రధాన కోచ్గా సేవలందించారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు స్పిన్ బౌలింగ్ కోచ్గా పనిచేశారు. యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో కూడా కీలక పాత్ర పోషించారు.
2022లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన బహుతులే, 2024 అండర్-19 ప్రపంచకప్ కోచింగ్ బృందంలో కూడా భాగమయ్యారు. 2021 నుంచి 2024 వరకు బీసీసీఐ జాతీయ క్రికెట్ అకాడమీ (ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో కోచింగ్ విభాగంలో పనిచేస్తూ అనేక మంది యువ స్పిన్నర్ల అభివృద్ధికి తోడ్పడ్డారు.
గౌరవంగా భావిస్తున్నా..
తన నియామకంపై స్పందించిన సైరాజ్ బహుతులే, భారత జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఒక ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో గొప్ప క్షణమైతే, ఇప్పుడు కోచ్గా మళ్లీ భారత క్రికెట్కు సేవ చేసే అవకాశం రావడం మరింత ప్రత్యేకమని చెప్పారు. అన్ని ఫార్మాట్లలో జట్టు విజయానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక, సైరాజ్ బహుతులే పేరు మరో ఆసక్తికరమైన సంఘటనతో కూడా ముడిపడి ఉంది. 1988లో శారదాశ్రమ్ విద్యామందిర్ తరఫున సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు కలిసి 664 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన లార్డ్ హారిస్ షీల్డ్ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు బౌలర్లలో బహుతులే కూడా ఒకరు. ఇప్పుడు భారత జట్టు స్పిన్ విభాగానికి మార్గదర్శకుడిగా మారిన ఆయన అనుభవం టీమ్ ఇండియాకు ఎంతో ఉపయోగపడనుంది.
