Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?

Sahil

Sahil

అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరుమీద ఉంది. జూన్ 2024లో సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 27 బంతుల్లోనే శతకం బాది ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సాహిల్ కేవలం 41 బంతుల్లోనే 18 భారీ సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో అజేయంగా 144 పరుగులు సాధించాడు.

ఇక భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాది ఈ అరుదైన ఘనత సాధించాడు. అయితే అభిషేక్ శర్మ సాధించిన అత్యంత వేగవంతమైన శతకం ప్రపంచంలోనే నంబర్ 1 అని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ముందు వరుసలో సాహిల్ చౌహాన్ ఉండటంతో అతడు ఎవరు.. ఎప్పుడు ఈ శతకం సాధించాడు అని చాలా మంది తెలుసుకోవాలని ఆత్రుతతో నెట్ లో అతడి గురించి వెతకడం మొదలు పెట్టారు.

అతడి నేపథ్యం విషయానికి వస్తే.. సాహిల్ అసలు ఎస్టోనియా దేశానికి చెందిన వ్యక్తి కాదు. అతనిది హరియాణా రాష్ట్రంలోని పింజోర్. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం అతను కొద్ది సంవత్సరాల క్రితం యూరప్‌కు వలస వెళ్లి ఎస్టోనియాలో స్థిరపడ్డాడు. అక్కడ స్థానికంగా రెస్టారెంట్ చైన్ మేనేజర్‌గా పనిచేస్తూనే, క్రికెట్ మీద ఉన్న మక్కువతో అక్కడి స్థానిక క్లబ్ మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో ఎస్టోనియా జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కూడా అతను ఎస్టోనియా జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. స్థానిక టీ10 లీగ్‌లలోనూ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. భారతీయ మూలాలు ఉన్న సాహిల్ చౌహాన్ ప్రపంచ క్రికెట్ రికార్డుల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోవడం విశేషం.