సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్- బీదర్ NH 161B పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. నారాయణఖేడ్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హైవే పక్కన కల్వర్టు గుంతలో అదుపుతప్పి బైక్ బోల్తా కొట్టింది. బైకు మీద నుంచి కిందపడిపోయిన యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Also Read:Red Lipstick Ban : రెడ్ లిప్స్టిక్ వేసుకుంటున్నారా? అయితే మీరు జైలుకే.. ఎక్కడో తెలుసా..
మృతులు నర్సింహులు(27), మల్లేష్ (24), మహేష్ (23)గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో బావ, ఇద్దరు బావమరిదులు ఉన్నారు. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. నర్సాపూర్ నుంచి నారాయణఖేడ్ వచ్చి… తిరిగి నర్సాపూర్ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ముగ్గురు యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.