వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా మరోసారి టాలీవుడ్, బాలీవుడ్ పెద్ద దర్శకులపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ధురంధర్’ సినిమాను ఆకాశానికెత్తేస్తూనే, భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులకు చురకలు అంటించారు. ‘ధురంధర్’ లాంటి చరిత్రను తిరగరాసే సినిమాలు వచ్చినప్పుడు, ఇండస్ట్రీలోని వారు దాన్ని పట్టించుకోనట్టు నటిస్తారని.. ఎందుకంటే ఆ సినిమా స్థాయిని తాము అందుకోలేమనే భయం వారిని వెంటాడుతోందని వర్మ విశ్లేషించారు.
Also Read : Chinmayi-Shivaji : క్షమాపణలు చెబితే సరిపోదు.. శివాజీ పై మరోసారి విరుచుకుపడ్డ చిన్మయి
ఈ పరిస్థితిని వర్మ ఒక అదిరిపోయే ఉదాహరణలతో వివరించారు. “మనం ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద భయంకరమైన కుక్క ఉందనుకోండి.. అది ఏమీ చేయదని యజమాని చెప్పినా మనలో టెన్షన్ తగ్గదు. కళ్ల మూలతో ఆ కుక్కనే చూస్తుంటాం. ఇప్పుడు ప్రతి పెద్ద సినిమా ఆఫీసులో ‘ధురంధర్’ అనే సినిమా ఒక భయపెట్టే కుక్కలా తిరుగుతోంది. మేకర్స్ ఆ పేరు ఎత్తడానికి కూడా భయపడుతున్నారు, కానీ వారి ఆలోచనల్లో మాత్రం ఆ సినిమానే మొదలవుతుంది” అని రాసుకొచ్చారు.
అంతే కాదు.. కేవలం భారీ సెట్లు, విఎఫ్ఎక్స్ (VFX), ఐటమ్ సాంగ్స్, హీరో ఎలివేషన్ నే నమ్ముకుని సినిమాలు తీసే వారికి ‘ధురంధర్’ ఒక హారర్ సినిమా లాంటిదని వర్మ ఎద్దేవా చేశారు. హీరోను కాకుండా సినిమాను పూజించే రోజులు వచ్చాయని, ఈ సినిమా ఒక అద్దంలా మారి పెద్ద దర్శకుల సినిమాల్లోని లోపాలను ఎత్తిచూపుతోందని చెప్పారు. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం హిట్ మాత్రమే కాదు, గత 50 ఏళ్లలోనే అత్యధికంగా చర్చించుకునే సినిమాగా నిలిచిందని వర్మ కొనియాడారు. మొత్తానికి వర్మ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Whenever a path breaking and monstrous hit like #dhurandhar comes , the industry people will wish to ignore it because they will feel threatened by it due to their inability to match it’s standards ..So they will think of it as a nightmare, which will vanish when they wake up in…
— Ram Gopal Varma (@RGVzoomin) December 25, 2025