NTV Telugu Site icon

CM Revanth Reddy : కేసీఆర్‌కు నేను సీఎం అయిన రెండో రోజే గుండె పగిలింది

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : బీఆర్‌ఎస్‌ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ భారీ సభ నిర్వహించారు. ఈ సభలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చ జరిగినట్లు చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు నిర్వహించిన అనుభవం జానారెడ్డి, కేకే (కే.కేశవరావు) దగ్గర ఉందని, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించేందుకు అధిష్టానం నిర్ణయాన్ని ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. పార్టీ హైకమాండ్ కు సమాచారం ఇచ్చి, పీస్ కమిటీ రిక్వెస్ట్ పంపిస్తామని తెలిపారు.

తాను సీఎం అయిన రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిపోయిందని ఆరోపించారు. ఇప్పడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని, రాష్ట్ర ఖజానాను లూటీ చేసింది కేసీఆర్ ని ఆయన మండిపడ్డారు. ఆయన స్పీచ్ అంతా అక్కసుతో నిండి ఉందని విమర్శించారు. కేసీఆర్ సభకు అవసరమైనన్ని బస్సులు సమకూర్చినప్పటికీ, గతంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వకపోవడం మోసపూరిత చర్య అని మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి రేవంత్ మాట్లాడుతూ.. చట్టం మేరకే చర్యలు తీసుకుంటామని, కేసీఆర్ లాగా నేను చట్టాన్ని అతిక్రమించను అని ఆయన అన్నారు. కేటీఆర్ మీద ఉన్న కేసులు కూడా చట్ట ప్రకారమే సాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో తాను చేసిన వ్యాఖ్యలే కేసీఆర్ సభలో పునరావృతం చేశారని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులను చిన్నపిల్లలుగా పేర్కొన్న వ్యాఖ్యలు కూడా కేసీఆర్ తీరుని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.

నాకు రాహుల్ గాంధీతో మంచి మైత్రి ఉందని, ఇది ఎవరు నమ్మినా, నమ్మకపోయినా నాకు పరవాలేదన్నారు. రాహుల్ గాంధీకి.. నాకు తెలిస్తే చాలు.. బయట ఎవరేం అనుకుంటున్నారు అనేది నాకు అనవసరమని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేయలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు.

కొంత మంది అధికారుల పని తీరు తెలిసినా, అవసరంగా ఉన్న కారణంగా వారి సేవలను కొనసాగించాల్సి వస్తోందన్నారు. కలెక్టర్ల మార్పు వేరే విషయమని, అవసరమైన మార్పులు చేసుకుంటామని వివరించారు. నన్ను నమ్ముకున్న వారిని నేను ఎప్పటికీ మర్చిపోనని, నన్ను నమ్మిన వారిలో ఒకరైన దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చెప్పారు. ఓపికగా ఉన్న వారికే తన నుండి బాధ్యతలు వస్తాయని, బయటకి వెళ్లి విమర్శలు చేస్తే తనపై బాధ్యత ఉండదని అన్నారు.