Ravi Shastri Feels Team India win World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో సెమీస్కు చేరిన భారత్.. లీగ్ దశలో నేడు చివరి మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలుపు ఖాయమే. సెమీస్లో న్యూజీలాండ్తో తలపడనున్న టీమిండియా.. ట్రోఫీ గెలుస్తుందని అందరూ అంటున్నారు. ఈ క్రమంలో భారత్ వరల్డ్కప్ అవకాశాలపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ను చేజిక్కించుకోవాలని, లేకపోతే మరో మూడు ప్రపంచకప్లు వేచి ఉండాల్సి ఉంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
శాస్త్రి క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లో రవిశాస్త్రి సహా ఆడమ్ గిల్క్రిస్ట్ మరియు మైఖేల్ వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘వన్డే ప్రపంచకప్ను 12 ఏళ్ల కిందట భారత్ గెలిచింది. ఇప్పుడు మరోసారి ట్రోఫీ గెలిచే అవకాశం వచ్చింది. ఇప్పుడు భారత జట్టు ఆడుతున్న తీరును చూస్తుంటే.. ఇదే మంచి అవకాశం అనిపిస్తోంది. ఈసారి మిస్ అయితే.. ట్రోఫీ గెలవడానికి మరో మూడు వరల్డ్కప్లు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు జట్టులో 7-8 మంది ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారు. వారిలో చాలా మందికి ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు. వారు ఆడుతున్న విధానం, పిచ్ పరిస్థితులు, భారత్ సాధిస్తున్న విజయాలను చూస్తుంటే ట్రోఫీ గెలవడం కష్టమేం కాదనిపిస్తోంది’ అని అన్నాడు.
‘భారత బౌలింగ్ గతంలో ఎన్నడూ లేని విధంగా బలంగా ఉంది. ఇది ఒక్క రాత్రిలోనే జరిగిపోలేదు. గత 4-5 ఏళ్లుగా భారత్ బౌలింగ్ పటిష్ఠంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ కలిసి చాలా సంవత్సరాల నుంచి జట్టు కోసం ఆడుతున్నారు. మొహ్మద్ సిరాజ్ వారికి జత కలిశాడు. ఈ ముగ్గురు నిలకడగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. భారత పిచ్లపై ఎక్కడ బౌలింగ్ చేస్తే వికెట్లు వస్తాయో వారికి అవగాహన ఉంది. షార్ట్ బాల్స్ను ఈ వరల్డ్కప్లో భారత బౌలర్లు తక్కువగానే సంధించారు. దాదాపు 90 శాతం స్టంప్స్ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ దాడి. సీమ్ పొజిషన్, బంతిని స్వింగ్ చేసే విధానం అద్భుతం’ అని రవిశాస్త్రి ప్రశంసించాడు.