Site icon NTV Telugu

Ramayana: ‘రామాయణ’కి జపాన్ ‘గాడ్జిల్లా’ షాక్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం భారీ యుద్ధం తప్పదా?

Ramayana Vs Godzilla Minus Zero

Ramayana Vs Godzilla Minus Zero

భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటి ‘ఐమ్యాక్స్ (IMAX)’ వెర్షన్ మూవీగా గుర్తింపు పొందబోతోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో ‘రామాయణ’ విజయానికి ఇప్పుడు జపాన్ నుంచి ఒక భారీ ముప్పు పొంచి ఉందనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో మొదలైంది.

Also Read : Varanasi :దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి భారీ ప్లాన్ మామూలుగా లేదుగా!

జపాన్ నుంచి రాబోతున్న ‘గాడ్జిల్లా మైనస్ జీరో (Godzilla Minus Zero)’ సినిమా ఇప్పుడు ‘రామాయణ’ మేకర్స్‌కు పెద్ద తలనెప్పిగా మారింది. 2023లో వచ్చిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్స్ అందించి ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకున్న ఆ సినిమాకు ఇది నేరుగా సీక్వెల్. తాజా సమాచారం ప్రకారం, ఈ గాడ్జిల్లా చిత్రం కూడా జపాన్ నుంచి వస్తున్న మొదటి ఐమ్యాక్స్ వెర్షన్ సినిమాగా ఖరారైంది. మరి ముఖ్యంగా, ఈ సినిమాను నవంబర్ 6న అంతర్జాతీయంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో రామాయణ సినిమా కూడా అదే సమయంలో గ్లోబల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండటంతో, ఐమ్యాక్స్ స్క్రీన్స్ కేటాయింపులో పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రేక్షకులలో గాడ్జిల్లాకు ఉన్న విపరీతమైన క్రేజ్ వల్ల, అమెరికా ఇతర పాశ్చాత్య దేశాలలో ఐమ్యాక్స్ స్క్రీన్స్ అధికంగా ఆ సినిమాకే కేటాయించే ఛాన్స్ ఉంది. సుమారు 4000 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ‘రామాయణ’ లాభాల బాట పట్టాలంటే ఓవర్సీస్ మార్కెట్, ఐమ్యాక్స్ కలెక్షన్స్ చాలా కీలకం. అటువంటి సమయంలో ఈ జపాన్ ‘గాడ్జిల్లా’ క్లాష్ ఇవ్వడం రామాయణ నిర్మాతలకు ఊహించని షాక్ అని చెప్పాలి. ఈ బాక్సాఫీస్ పోరులో రణబీర్ కపూర్ ‘రామాయణ’ అంతర్జాతీయ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Exit mobile version