Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?

  • తెలంగాణలో ఏ వర్గం సంతృప్తిగా లేదు
  • ఇచ్చిన హామీలు అమలు చేయలేక అబద్ధాలు చెబుతున్నారు
  • మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే, ఇక సీఎం ఎందుకు?
Ramchander Rao

Ramchander Rao

అంబర్‌పేట్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచందర్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏ వర్గం ప్రజలు కూడా సంతృప్తిగా లేరని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని అబద్ధాలకు తల్లిగా అభివర్ణించిన ఆయన.. హామీలను నెరవేర్చలేక ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.

రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటోందని రామచందర్ రావు విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారని.. అన్ని పనులు కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తే ముఖ్యమంత్రి పదవిలో మీరు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఒక్కరోజు వర్షం పడితేనే నగరం అతలాకుతలమైందన్నారు. ఈ పరిస్థితికి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

×
×
Ad

ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కూడా రామచందర్ రావు విమర్శలు చేశారు. ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. రాబోయే మూడు మున్సిపాలిటీల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ప్రేమ బంధం ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ రెండు పార్టీలకు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందని, ఈ మూడు పార్టీలు కలిసి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాసేవ కోసం కాకుండా కమిషన్ల కోసం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వద్ద అనేక శాఖలు, మంత్రి పదవుల బాధ్యతలు ఎందుకు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేసిందనే అంశంపై సచివాలయం గేట్ ముందు బహిరంగ చర్చకు సిద్ధమని రామచందర్ రావు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి ముందుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల అభివృద్ధి గురించి మాట్లాడాలని.. ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా ప్రచార రాజకీయాలు చేస్తున్నారని రామచందర్ రావు విమర్శించారు.