Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..

Rajnath Singh2

Rajnath Singh2

Rajnath Singh: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భగా లడఖ్‌లోని ద్రాస్ వద్ద ఆయన ప్రసంగించారు. ఒకవైపు భారతదేశం ఆవిష్కరణలు, అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకెళ్తుంటే.. మరోవైపు పాకిస్థాన్ మాత్రం సరిహద్దు తీవ్రవాదానికే మద్దతు ఇస్తూ నాశనమవుతోందని స్పష్టమైన వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. “భారత్ డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. పాకిస్థాన్ మతోన్మాద కేంద్రాలను (Radicalisation centres) నిర్మిస్తోంది. భారత్ యూపీఐ (UPI) ద్వారా ప్రపంచాన్ని అనుసంధానిస్తుంటే, పాకిస్థాన్ హవాలా ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది” అని ఆయన ఎద్దేవా చేశారు.

భారత్ నవతరం స్టార్టప్‌ల సంస్కృతిని ప్రోత్సహిస్తుంటే, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాద ఆవాసాలను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. “భారతదేశం సెమీకండక్టర్లను తయారు చేస్తుంటే.. పాకిస్థాన్ ఆత్మాహుతి బాంబర్లను తయారు చేస్తోంది. భారత్ అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపుతుంటే, దాయాది దేశం సరిహద్దు దాటించి ఉగ్రవాదులను పంపుతోంది. ప్రపంచానికి భారత్ సాఫ్ట్‌వేర్ అందిస్తుంటే, పాక్ ఉగ్రవాదాన్ని సరఫరా చేస్తోంది” అని రాజ్‌నాథ్ తీవ్ర పదజాలంతో విమర్శించారు. భారత్ పురోగతిని అడ్డుకోవడానికి ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా సహించేది లేదని, మన సాయుధ దళాలు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. అంతేకాకుండా, పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలైనా కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) అంశంపైనే ఉంటాయని, అది ఎప్పటికీ భారతదేశంలో భాగమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ స్పష్టమైన విధానాన్ని పునరుద్ఘాటించారు.

మరోవైపు, 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించేందుకు ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ‘శ్రద్ధాంజలి సమారోహ్’ శౌర్య సంధ్య కార్యక్రమాలను భారత సైన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రక్షణ మంత్రి, అమరజవాన్ల స్మారకం వద్ద నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపకార్థ కలశాలను అందజేశారు. ఆపరేషన్ విజయ్ 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలను నిర్వహించారు. మంచుతో కప్పబడిన శిఖరాలను, శత్రువుల కాల్పులను లెక్కచేయకుండా 1999 జూలై 26న కార్గిల్ ఎత్తులను తిరిగి స్వాధీనం చేసుకుని భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయానికి ప్రతీకగా ఈ రోజును ‘కార్గిల్ విజయ్ దివాస్’గా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.