MLA Prakash Goud: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

  • కాంగ్రెస్‌లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్
Prakash Goud

Prakash Goud

MLA Prakash Goud: తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ తన నివాసంలో ప్రకాశ్‌ గౌడ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వెంట మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి వచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్‌ను గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ప్రకాశ్‌ గౌడ్‌ చేరడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది.

Read Also: Dharmendra Pradhan: రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అవుతారు.. !