రాజమౌళి మరియు మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఓ హాలీవుడ్ మీడియాతో వారణాసి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా కథ, కథనం, రన్ టైమ్ తో పాటు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
రాజమౌళి మాట్లాడుతూ, “నా ప్రతి సినిమాలోనూ రామాయణం, మహాభారతం యొక్క స్ఫూర్తి ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో అది కేవలం స్ఫూర్తి మాత్రమే కాదు. మేము రామాయణంలోని ఒక భాగాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాము. వారణాసి కేవలం భారతీయ సంస్కృతి మరియు కథల గురించి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ ఎమోషన్స్తో సాగుతుంది. ‘RRR’ సినిమాను వరల్డ్ వైడ్ గా ఎలాగైతే ఆదరించిందో, ఈ చిత్రాన్ని కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
Also Read : Mahesh Babu : ‘పోకిరి’ నా జీవితాన్ని మార్చేసింది.. మళ్ళీ ‘వారణాసి’ తో అదే జరగబోతుంది
ఆలాగే వారణాసి టూ పార్ట్స్ పై జక్కన్న స్పందిస్తూ ‘కథ చాలా పెద్దది కావడంతో, ఒక దశలో మేము ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఆలోచించాము. కానీ త్వరగానే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాము. ప్రస్తుతానికి ఈ సినిమా ఒకే పార్ట్గా రాబోతోంది. సినిమా నిడివి సుమారు 3 గంటల వరకు ఉంటుంది. ఈ మూడు గంటల ప్రయాణం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది” అని రాజమౌళి వెల్లడించారు. వారణాసి నేపథ్యంగా సాగే ఈ కథలో భారతీయ మూలాలు బలంగా కనిపిస్తాయని, అదే సమయంలో హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఉంటుందని తెలుస్తోంది.