ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. భారత్ జోడో పేరిట రాహుల్ గాంధీ చేస్తున్న ఈ పాదయాత్ర రేపు తెలంగాణ లోకి ప్రవేశించనుంది. రాయచూర్ యర్మరస్ నుండి మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకు రాహుల్ యాత్ర సాగనుంది. రేపు దాదాపు 13 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర చేయనున్నారు. కృష్ణ నది బ్రిడ్జి మీద రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలకనున్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీ కి జాతీయ పతాకాన్ని టీ కాంగ్రెస్ నేతలు అందించనున్నారు. కృష్ణా నదిబ్రిడ్జినుండి తెలంగాణలో మూడు కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర సాగనుంది.
ఈ నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మక్తల్ చేరుకుంటున్నారు. రేపు మరిక్కల్ వద్ద ప్రసంగించాక ఢిల్లీకి రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. మక్తల్ నుండి హైదరాబాద్ కి హెలికాప్టర్ లో ప్రయాణం.. అక్కడ నుండి ఢిల్లీ కి రాహుల్ వెళ్లనున్నారు. దీపావళి పండుగ కోసం మూడు రోజులు జోడో యాత్ర కు బ్రేక్ ఇవ్వనున్నారు. అయితే.. ఈ నెల 27 ఉదయం 6 గంటల నుండి మళ్లీ మక్తల్ నుండి జోడో యాత్ర ఆరంభం కానుంది. నవంబర్ 8 వరకు తెలంగాణలో జోడో యాత్ర నిర్వహించనున్నారు.