Bomb Threat: పంజాబ్లో మరోసారి బాంబు బెదిరింపులు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కార్యాలయానికే బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏకంగా సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ మెయిల్ రావడం కలకలం సృష్టించింది. కేవలం ముఖ్యమంత్రినే కాకుండా, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ను సైతం లక్ష్యంగా చేసుకుంటూ దుండగులు ఈ మెయిల్ పంపారు. ఇందులో పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యాలయంతో పాటు చండీగఢ్, ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ను సైతం పేల్చివేస్తామని స్పష్టంగా పేర్కొనడం గందరగోళానికి గురి చేస్తోంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశాయి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం, బీజేపీ ఆఫీసుల వద్ద భద్రతా వలయాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. అయితే పంజాబ్లో ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. మే 7న జలంధర్లోని బి.ఎం.సి చౌక్ వద్ద ఉన్న ఏపీజే స్కూల్కు బాంబు బెదిరింపు రావడంతో అప్పట్లో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం వెంటనే విద్యార్థులందరికీ సెలవు ప్రకటించి ఇళ్లకు పంపించేసింది. ఆ సమయంలో స్కూల్ క్యాంపస్లో తీవ్ర గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. పంజాబ్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు ఇప్పుడు సామాన్య ప్రజలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి.
