NTV Telugu Site icon

PT Usha: రెజ్లర్ల నిరసన క్రమశిక్షణారాహిత్యానికి సమానం.. ఆటగాళ్లు వీధుల్లో ఇలా చేయకూడదు..

Pt Usha

Pt Usha

PT Usha: లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో అగ్రశ్రేణి క్రీడాకారులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలిశారు. మాజీ ఒలింపియన్ అయిన పీటీ ఉష అక్కడ గుమిగూడిన మీడియాతో మాట్లాడకుండా నిరసన స్థలం నుంచి వెళ్లిపోయారు. అయితే, రెజ్లర్ బజరంగ్ పునియా క్రీడాకారులకు సహాయం చేస్తామని పీటీ ఉష హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. “తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని, తాను మొదట క్రీడాకారిణినని, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్‌నని పీటీ ఉష అన్నారు” అని బజరంగ్ పునియా అన్నారు. మా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారని తెలిపారు. నిరసన తెలపాలనే ముందు వారి ఆరోపణలను పరిశీలించడానికి నియమించబడిన కమిటీ నివేదిక కోసం రెజ్లర్లు వేచి ఉండరని పీటీ ఉష గత నెలలో విమర్శించారు. రెజ్లర్ల నిరసన క్రమశిక్షణారాహిత్యానికి సమానమని పీటీ ఉష ఇవాళ పేర్కొన్నారు. ఆటగాళ్లు వీధుల్లో ఇలా నిరసనలు చేయకూడదని.. కనీసం కమిటీ నివేదిక కోసం ఎదురుచూడాలన్నారు. వారు చేసిన పని ఆటకు, దేశానికి మంచిది కాదన్న పీటీ ఉష.. ఇది ప్రతికూల విధానమని అన్నారు.

పీటీ ఉష ప్రకటనపై రెజ్లర్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. వారు మద్దతు కోసం చూస్తున్నందున పీటీ ఉష వ్యాఖ్యలతో బాధపడ్డామని చెప్పారు. “పీటీ ఉష వ్యాఖ్యతో బాధపడ్డాం. స్వయంగా మహిళ అయినప్పటికీ ఆమె మాకు మద్దతు ఇవ్వడం లేదు. ఏం క్రమశిక్షణారాహిత్యం చేశాం. మేం శాంతియుతంగా ఇక్కడ కూర్చున్నాం. మాకు న్యాయం జరిగి ఉంటే ఇలా చేసి ఉండేవారం కాదు” అని రెజ్లర్ సాక్షి మాలిక్‌ అన్నారు. తమ విషయం గురించి చర్చించడానికి పీటీ ఉషకు ఫోన్‌ చేశామని, అయితే ఆమె తన కాల్‌కు సమాధానం ఇవ్వలేదని రెజ్లర్‌ వినేశ్ ఫోగట్ ఆరోపించారు. ఆమెకు ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నాయో లేవో తమకు తెలియదని వినేశ్ ఫోగట్ అన్నారు.

Read Also: Wrestler Vinesh Phogat: కేంద్రమంత్రిపై రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ఆరోపణలు..

లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద భారతీయ అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసనలు చేపట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు.పోలీసు చర్యకు హామీ ఇచ్చినప్పటికీ, డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు తమ నిరసనను కొనసాగిస్తామని చెప్పారు. “మేము సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తాము, కానీ మాకు ఢిల్లీ పోలీసులపై నమ్మకం లేదు. ఈ పోరాటం ఎఫ్ఐఆర్ కోసం కాదు. ఈ పోరాటం అతనిలాంటి వారిని శిక్షించడానికి. అతను జైలులో ఉండాలి. అతని పోర్ట్‌ఫోలియోలను తీసివేయాలి. “అని మల్లయోధులు చెప్పారు.