వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన విషయం విదితమే. మంగళవారం నామినేషన్ వేసే ముందు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు చేశారు. అనంతరం వారణాసిలోని కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అంతకు ముందే అతడి ప్రతిపాదకులు, ఎన్డీఏ ముఖ్యనేతలు నామినేషన్ వేదికకు చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఆయన వెంట ఉన్నారు.
READ MORE:KKR Fan: బాల్ను దొంగిలించడానికి ప్రయత్నించాడు.. పోలీసులకు దొరికిపోయాడు!
అనంతరం ఎన్డీఏ నేతలతో మోడీ కలవనున్నారు. నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం ప్రధాని మోడీ జార్ఖండ్కు బయలుదేరి వెళ్లనున్నారు. వారణాసికి బీజేపీ, ఎన్డీఏ ముఖ్యనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, రాందాస్ అథవాలే, అమిత్ షా, జయంత్ చౌదరి, ఓం ప్రకాష్ రాజ్భర్, సంజయ్ నిషాద్, అనుప్రియా పటేల్, ప్రఫుల్ పటేల్, చంద్రబాబు నాయుడు, ఏక్నాథ్ షిండే, హర్దీప్ పూరి, పవన్ కళ్యాణ్ తదితరులు చేరుకున్నారు. కాగా.. ఈ స్థానానికి జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి మరోసారి మోడీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.