ప్రజా పాలన దరఖాస్తులు జనవరి 6నే చివరి రోజు అని మళ్ళీ గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసు అని అన్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారని, కాళేశ్వరం పై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామన్నారు. కేసీఆర్ ను రక్షించేందుకే సిబిఐ విచారణ బీజేపీ అడుగుతుందన్నారు. జ్యుడీషియల్ విచారణకు కేంద్రంలో ఉన్న బీజేపీ న్యాయ శాఖ సుప్రీం, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జీని నియమించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. బీఆర్ఎస్ కు బీజేపీకి దోస్తీ ఉందని, గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు, జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ పై ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. ఇప్పటి కి బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే పరిస్థితి లేదని, కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే… మీ లేఖకు విలువ లేకుంటే కిషన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. బీజేపీది, బిఆర్ఎస్ ది అపవిత్ర కలయిక. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు తిట్టుకుంటారో తెలియదన్నారు పొన్నం ప్రభాకర్.
కాళేశ్వరం ఏటీఎం అని బీజేపీ పదే పదే అన్నదని, లిక్కర్ స్కామ్ అని కూడా బీజేపీ అన్నదని, కేసీఆర్ కు ఇంత తొక్కుగా మాట్లాడవద్దు. మాట్లాడే ముందే ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ ప్రజల విషయంలో కేసీఆర్ కుటుంబం అనేక తప్పులు చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు సోకులకు కాదు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమేనన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే రాష్ట్రంలో సిబిఐ పై బ్యాన్ ఎత్తివేస్తామని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ట్రక్ డ్రైవర్లు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రవాణా చట్టంను కొంతకాలం నిలిపివేయాలన్నారు. ట్రక్ యజమానుల సమ్మె పై కేంద్రం వెంటనే చర్చలు జరిపాలని, ఆటో డ్రైవర్లు బిఆర్ఎస్ ట్రాప్ లో పడకండని, ఓలా, ఉబర్, ర్యాపిడో, మెట్రో ఇతరత్రా అన్ని వచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా? అయినా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకిస్తున్నారా? బిఆర్ఎస్ స్పష్టం చేయాలని, ఆటో డ్రైవర్లతో చర్చలకు మేము సిద్ధమన్నారు.