కలియుగంలో కల్కి అవతారం ఎత్తి భగవంతుడు వచ్చినా కల్తీని అంతం చేయలేడేమో..!! యస్.. మీరు విన్నది కరెక్టే..!! మొన్నటికి మొన్న కల్తీ టీ పౌడర్ చూశాం.. నిన్నటికి నిన్న సబ్బులు, షాంపూలు, దోమలను నివారించే మస్కిటో రిపెల్లెంట్స్ కల్తీ చేయడం చూశాం. తాజాగా కల్తీ కేటుగాళ్లు అల్లం పేస్ట్ కల్తీ చేస్తూ పట్టుబడ్డారు. లాలాగూడలో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ అల్లం తయారు చేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
Also Read:Power Bill Hike: విద్యుత్ ఛార్జీల పెంపు.. వివరాలు వెల్లడించిన ఈఆర్సీ
కల్తీ..కల్తీ..కల్తీ.. ఎక్కడ చూసినా కల్తీ.. ఏ పదార్థం చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని ఆహార పదార్థాలు కల్తీమయం.. కొద్దిరోజుల్లో ఇలాంటి మాటలే వినిపిస్తాయి.. హైదరాబాద్లో మళ్లీ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన గుప్పుమంది… ఈసారి లాలాగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేటుగాళ్లను పట్టుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ సిటీ కమిషనర్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ బృందం, లాలాగూడ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. లాలాగూడలోని జనప్రియ అపార్ట్మెంట్ సమీపంలో జనావాసాల మధ్యలో కల్తీ కేటుగాళ్లు వ్యాపారం చేస్తున్నారు. ‘ఝాన్సీ’ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేరుతో వ్యాపారం చేస్తున్న గోడౌన్పై దాడి చేశారు పోలీసులు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. లాలాగూడ పోలీస్ స్టేషన్లో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఝాన్సీ కంపెనీ యజమాని నీలం వెంకటేశ్వర్లుగా పేర్కొన్నారు. అతనితోపాటు సూపర్ వైజర్ కె. వినోద్, వర్కర్ టీ సతీష్, మరో వర్కర్ ఎం. శివానిని అదుపులోకి తీసుకున్నారు.