President Murmu: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. బెంగాల్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం జరిగిన ‘అంతర్జాతీయ సంతాలీ సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెంగాల్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పర్యటనకు వస్తే కనీసం ముఖ్యమంత్రి గానీ, ఆమె క్యాబినెట్ మంత్రులు గానీ స్వాగతం పలికేందుకు రాకపోవడంపై ముర్ము ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “మమతా బెనర్జీ నాపై ఏమైనా అసంతృప్తితో ఉన్నారా? అందుకే ఎవరూ రాలేదా?” అని ఆమె ప్రశ్నించారు.
READ ALSO: దేశంలో ఇంధన కొరత..! HPCL కీలక ప్రకటన..
ఈ సదస్సును ముందుగా బిధాన్నగర్లో నిర్వహించాల్సి ఉండగా, చివరి నిమిషంలో గోషాయిపూర్కు మార్చడంపై ఆమె మండిపడ్డారు. అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, జనం తక్కువగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో కేంద్రం గిరిజనులకు కొత్త గుర్తింపునిచ్చిందని చెబుతూనే.. బెంగాల్లోని సంతాలీలు, ఇతర గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని ఆమె విమర్శించారు. గిరిజనులు ఏకం కావడం, చదువుకోవడం కొందరికి ఇష్టం లేదని ఆమె పరోక్షంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ (X) వేదికగా స్పందించారు. రాష్ట్రపతి పట్ల మమతా ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజ్యాంగ మర్యాదలను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. బెంగాల్లో పాలన అస్తవ్యస్తంగా మారిందనడానికి ఇదొక నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. కోల్కతాలో ఓ నిరసన కార్యక్రమంలో ఉన్న ఆమె.. రాష్ట్రపతి పదవికి తగని రీతిలో ముర్ము రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. “రాష్ట్రపతి కేవలం ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడటం సరికాదు. బెంగాల్లోని అన్ని వర్గాలను మీరు చూడాలి. మీ వద్దకు మా ఎంపీలను పంపిస్తాం, గిరిజనుల కోసం మేం చేసిన అభివృద్ధి పనుల వివరాలను వారు మీకు సమర్పిస్తారు” అని మమత పేర్కొన్నారు. టీఎంసీ పార్టీ కూడా దీనిపై స్పందిస్తూ.. గిరిజనుల అభివృద్ధిపై రాష్ట్రపతికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది.
READ ALSO: Veg Fish Curry: చేప లేని ‘చేపల పులుసు’.. అదిరిపోయే టేస్ట్! ఇలా చేసుకోండి..