Cyclone Biparjoy: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను తీవ్ర తుపానుగా మారింది. గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుఫాను గుజరాత్ లోని పోర్ బందర్ కు నైరుతి దిశగా 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. జూన్ 15న కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ క్రమంలో తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తుఫాను పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ప్రధాని ఆదేశించారు. విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు వంటి అన్ని అత్యవసర సేవల నిర్వహణ ఉండేలా చూడాలని కోరారు.
Read Also: Viral News: తాగితే లోకమే మరిచిపోతారా.. తాగిన మత్తులో.. అలా చేశాడు..!
ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ ఎం రవిచంద్రన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి కమల్ కిషోర్, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ హాజరయ్యారు. తుఫాను తీవ్రత పెరిగితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా భద్రతకు భరోసా కల్పించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. తుఫాను దృష్ట్యా అధికారులు సముద్ర తీరాల జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా గుజరాత్ దక్షిణ, ఉత్తర తీరాల్లో చేపల వేట కార్యకలాపాలను నిలిపివేశారు.
Read Also:
ఇప్పటివరకు 1,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తీరప్రాంత ద్వారకా అధికారులు తెలిపారు. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుండటంతో కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మత్స్యకారులు ఈ నెల 15 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తీరప్రాంతాల్లో హెచ్చరికలు పంపారు. మరోవైపు సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. ఆన్షోర్, ఆఫ్షోర్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలనీ, కచ్, దేవభూమి ద్వారకా, పోరుబందరు, జామ్ నగర్, రాజ్ కోట్, జునాగఢ్, మోర్బి జిల్లాలతో సహా సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాల నుండి తరలింపును సమీకరించాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది.