రాజధాని అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. పునఃప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఏపీ సర్కారు ఎంపిక చేసింది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది.
రాజధాని నిర్మాణాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంకు 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రముఖులు, ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.