గత పదేళ్ల అధికారాన్ని దేశాభివృద్ధి కోసమే ఉపయోగించామని ప్రధాని మోడీ తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకముందు కాంగ్రెస్ మాత్రం దశాబ్దాల మెజార్టీని కుటుంబాన్ని బలోపేతం చేసేందుకే ఉపయోగించిందని దుయ్యబట్టారు. ఇక జరగబోయే ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు అని మోడీ వ్యాఖ్యానించారు.
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలకు ప్రధాని మోడీ గట్టిగా బదులిచ్చారు. అవినీతిపరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు బీజేపీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇలాంటి చర్యలే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ నాయకులనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని కొందరు కావాలనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని.. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3 శాతమే వాటికే రాజకీయాలతో సంబంధముందని తెలిపారు. మిగతా 97 శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవేనని మోడీ వెల్లడించారు.
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని స్పష్టం చేశారు. గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయడం, లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు అందేలా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ను తీసుకురావడం దానిలో భాగమేనని గుర్తుచేశారు. ఈ చర్యలతో గత పదేళ్లలో దాదాపు 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారుల పేర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో రూ.22.75లక్షల కోట్లను తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినట్లు వివరించారు.
2014 ముందు ఈడీ అటాచ్ చేసుకున్న ఆస్తులు విలువ రూ.25వేల కోట్లుగా ఉండగా.. గత పదేళ్లలో ఆ మొత్తం రూ.లక్ష కోట్లకు పెరిగిందని మోడీ వెల్లడించారు. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. కానీ ఇంతలోనే పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే చాలా మంది ఈవీఎంలపై నిందలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని విపక్షాలకూ తెలుసు అని వ్యాఖ్యానించారు. అందుకే చాలా మంది ప్రతిపక్ష నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారని మోడీ విమర్శించారు.
ఇక దేశ వ్యాప్తంగా ఏడు దిశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.