DK Shivakumar: లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఖర్గే సొంత జిల్లా కలబురగి నుంచి ప్రారంభించినందున ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు భయపడుతున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. కలబురగితో పాటు కర్ణాటకలోని 20 లోక్సభ స్థానాలను పార్టీ గెలుచుకోవడం ఖాయమని అన్నారు. “ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అంటే ప్రధాని మోడీకి భయం. అందుకే ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని కర్ణాటక, ముఖ్యంగా కలబురగి నుంచి ప్రారంభించారు. కలబురగి పార్లమెంటరీ నియోజకవర్గంతో సహా కర్ణాటకలో 20 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది” అని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi : ‘జైట్లీ నా వద్దకు వచ్చి.. భూసేకరణపై మాట్లాడకండి అన్నారు’.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
కలబురగి (గుల్బర్గా లోక్సభ సెగ్మెంట్) 2009, 2014లో లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సొంత జిల్లా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ చేతిలో ఓడిపోయారు. పార్టీ రెండో జాబితా గురించి ప్రశ్నించగా.. కర్ణాటకలోని లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల రెండో జాబితాను మార్చి 20న ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలకు గాను.. కాంగ్రెస్ ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మార్చి 19న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని, మార్చి 20న జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని డీకే శివకుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయిల్లో మార్చి 21న హామీ అమలు కమిటీ సభ్యుల సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వారికి లోక్సభ ఎన్నికల బాధ్యతలు అప్పగించబోతున్నామని ఆయన అన్నారు.
Read Also: Maldives Election: మాల్దీవులలో ఎన్నికలు.. భారత్లో బ్యాలెట్ బాక్స్లు?.. విషయం ఏంటంటే?
కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019లో బీజేపీ 51.7 శాతం ఓట్లతో 25 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 32.1 శాతం ఓట్లతో ఒక సీటు గెలుచుకుంది. మరోవైపు, జేడీ (ఎస్) కూడా ఒక సీటును గెలుచుకుంది. దక్షిణ భారత నటి సుమలత అంబరీష్.. స్వతంత్ర ఎంపీగా కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో గెలిచారు. కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. 543 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

