Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ భేటీలో పాలనా సంస్కరణలు, పరిపాలనా సామర్థ్యం, ‘వికసిత్ భారత్ 2047’ దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు ప్రస్తుత పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం వల్ల తలెత్తే పరిణామాలపై లోతుగా చర్చించారు. ‘సేవా తీర్థ్’ వేదికగా సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు గల సహాయ మంత్రులు, సహాయ మంత్రులందరూ హాజరయ్యారు. ఈ ఏడాదిలో పూర్తి స్థాయి మంత్రిమండలి భేటీ కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావస్తున్న తరుణంలో.. ప్రభుత్వ పనితీరును బేరీజు వేసే ఒక ‘మిడ్టర్మ్ రివ్యూ’ (మధ్యంతర సమీక్ష) లాగా ఈ సెషన్ సాగింది.
సమావేశంలో తొమ్మిది కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు తమ పనితీరు, భవిష్యత్తు కార్యాచరణపై సవివరమైన ప్రెజెంటేషన్లు ఇచ్చాయి. కేబినెట్ సెక్రటరీ, నీతి ఆయోగ్ సైతం కీలకమైన ప్రెజెంటేషన్లను సమర్పించాయి. ఫైళ్లను అత్యంత వేగంగా పరిష్కరిస్తూ, నిర్ణయాలను సకాలంలో అమలు చేయడంలో ముందున్న శాఖలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. ప్రధాని మోడీ ఇటీవలి ఐదు దేశాల పర్యటన, దానివల్ల చేకూరిన దౌత్యపరమైన ప్రయోజనాలను మంత్రిమండలికి వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం గురించి ప్రస్తావించిన ప్రధాని మోడీ.. దీనివల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, విమానయానం, షిప్పింగ్, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాలపై ఈ భేటీలో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిజానికి పశ్చిమాసియా పరిస్థితులను పర్యవేక్షించడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి అనధికారిక మంత్రుల బృందం పని చేస్తోంది. అయితే రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనలో ఉండటం వల్ల, అలాగే ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా జెనీవాలో ఉండటం వల్ల వారు ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు.
Also Read
ఇక ఐదు దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారమే ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీకి ఈ సమావేశంలో ఘన సత్కారం లభించింది. విదేశీ పర్యటన విజయవంతం కావడం, అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినందుకు గానూ మోడీని మంత్రులు అభినందించారు. ఇంధన భద్రత, రక్షణ సహకారం, వాణిజ్యం, కీలక ఖనిజాల సరఫరా వంటి రంగాలలో భారతదేశ భాగస్వామ్యాన్ని విస్తరించడమే లక్ష్యంగా మోడీ యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటించారు. యూఏఈ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక చమురు నిల్వలు, దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ, షిప్పింగ్ రంగాలలో పలు ఒప్పందాలు జరిగాయి. అలాగే అబుదాబి భారతదేశంలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మోడీ జరిపిన ఈ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఐరోపా (యూరప్) దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్తో భారత్ 17 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసి, ఇరుదేశాల బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకుంది. అక్కడ కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన స్థిరత్వంపై చర్చలు జరిగాయి. అటు స్వీడన్, నార్వే దేశాలతో కూడా సంబంధాలు మరింత బలపడ్డాయి. క్లీన్ ఎనర్జీ, ఆవిష్కరణలు, రక్షణ, డిజిటల్ టెక్నాలజీలు, కీలక ఖనిజాల రంగాలలో సహకార ఫ్రేమ్వర్క్లను ప్రకటించడంతో పాటు, ‘ఇండియా-నార్డిక్ సమ్మిట్’ ద్వారా విస్తృతమైన చర్చలు జరిగాయి. మోడీ పర్యటన చివరి విడతగా ఇటలీ చేరుకుని, అక్కడ ప్రధాని జార్జియా మెలోనితో జరిపిన చర్చల అనంతరం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచారు. ఈ సుదీర్ఘ అనుభవాలు, విజయాల నేపథ్యాన్ని గుర్తుచేస్తూనే.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని కేవలం ఒక నినాదంగా కాకుండా, ఒక పవిత్రమైన బాధ్యతగా, నిబద్ధతతో స్వీకరించి పని చేయాలని కేంద్ర మంత్రులందరికీ ప్రధాని మోడీ స్పష్టమైన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..