లోక్ సభ ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసరా పెన్షన్ల పంపిణీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను తప్పించడంతో పెన్షన్దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో గుంటూరుకు చెందిన ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. ఇంటి దగ్గరే పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు ఆ పిటిషన్లో తెలిపారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే తీవ్ర ఇబ్బందులు పడతామన్నారు. ఇక, పెన్షనర్ల పిటిషన్పై నేడు (బుధవారం) ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇక, ఏపీ హైకోర్టు పెన్షన్దారుల పిటిషన్ను విచారణకు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. ఒక వేళ ఈ పిటిషన్పై విచారణ జరిపితే ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. కాగా, పెన్షన్ల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను తొలగించాలని ఈసీ ఆదేశించింది. వాలంటీర్ల తొలగింపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్గా మారింది. టీడీపీ వల్లే వాలంటీర్లను తొలగించారని వైసీపీ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో పెన్సన్లర్లు హైకోర్టును ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.